1984 అల్లర్లు పునరావృతం కావొద్దు..

ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టులో బుధవారం మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈ అల్లర్ల ఘటనపై ఢిల్లీ హైకోర్టు ఇవాళ ఉదయం పోలీసులకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. విచారణకు ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ అల్లర్లపై కోర్టు విచారణ జరిపింది.


దేశ రాజధానిలో 1984 నాటి తరహాలో అల్లర్లు పునరావృతం కావొద్దు అని హెచ్చరించింది. పూర్తి స్థాయిలో పౌరులకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. ప్రభావిత ప్రాంతాలను ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం సందర్శించాలని కోర్టు ఆదేశించింది. ప్రతి ఒక్క బాధితుడి వద్దకు చేరుకోవాల్సిన సమయం ఇది అని కోర్టు తెలిపింది. ప్రతి ఒక్కరికి జడ్‌ సెక్యూరిటీలా రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశించింది. బాధితులు, వారి కుటుంబాలను ఉన్నతాధికారులు పరామర్శించాలి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోర్టు ఆదేశించింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఐబీ ఆఫీసర్‌ మృతి చెందడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఐబీ ఆఫీసర్‌ చనిపోవడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది.